రతనాలసీమ మన రాయలసీమ: ఫోన్ల నుండి కార్ల వరకు వాడే 15అరుదైన ఖనిజలవణాలు గుర్తింపు!!
అనంతపురం జిల్లాలో అత్యంత అరుదైన ఖనిజ సంపదను గుర్తించారు పరిశోధకులు. ఎంతో విలువైన 15 విశిష్టమైన ఖనిజ లవణాలను గుర్తించారు. హైదరాబాదులోని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అద్భుతమైన అరుదైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఇక అనంతపురంలో గుర్తించిన ఖనిజ లవణాలు ప్రజలు నిత్యం ఉపయోగించే సెల్ఫోన్ల నుంచి టీవీల వరకు అనేక వస్తువులలో ఉపయోగిస్తారని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు పరిశ్రమలలోనే వీటి వినియోగం ఎంతగానో ఉంటుందని చెబుతున్నారు.
అనంతపురం జిల్లాలోని పలుచోట్ల సైనైటిస్ వంటి సాంప్రదాయేతర శిలలపై పరిశోధనలు నిర్వహించిన క్రమంలో 15 విశిష్టమైన ఖనిజలవణాలను గుర్తించారు. శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్న సమయంలో లాంథనైట్ సిరీస్ లోని పలు మూలకాలు, ఖనిజలవణాలు వెలుగులోకి వచ్చినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా శాస్త్రవేత్తలు గుర్తించిన వాటిలో సెరియేట్, థోరైట్, అల్లనైట్, టాంటలైట్, కొలంబైట్, అపటైట్, మోనజైట్, పైరోక్లోర్ యూక్జెనైట్, ఫ్లోరైట్, జీర్కోన్ వంటి ఖనిజలవణాలు గుర్తించినట్టు తెలిపారు. అంతేకాదు అక్కడ రేడియో యాక్టివ్ మూలకాలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రాయలసీమలోని అనంతపురం జిల్లాలో 15 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ఈఈకి చెందిన భారీ నిక్షేపాలను కనుగొన్న శాస్త్రవేత్తలు ఇవి అనేక రంగాలలో అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తాయన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, క్లీన్ ఎనర్జీ ,శాశ్వత అయస్కాంతాల తయారీతోపాటు, ఆధునిక ఎలక్ట్రానిక్స్ లో కీలక భాగమైన విండ్ టర్బైన్లు, జెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సహా అనేక ఇతర రంగాలలో వీటిని వాడతారని చెబుతున్నారు.
అనంతపురం, చిత్తూరు జిల్లాలోని దంచర్ల, పెద్దవడుగూరు, దండువారిపల్లి, రెడ్డిపల్లి చింతల్ చెరువు, పులికొండ కాంప్లెక్స్ ఈ ఖనిజాలకు కేంద్రాలుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా మరింత లోతుగా ఇక్కడ ఉన్న ఖనిజనిక్షేపాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇక ఈ పరిశోధనలో కీలకంగా భాగస్వామ్యం పంచుకున్న ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్త పీవీ సుందర్ రాజు రెడ్డి పల్లె, పెద్దవడుగూరు ప్రాంతాలలో తవ్వకాలు చేపట్టామని, అక్కడే జిర్కోన్ పలు రూపాలలో లభ్యమైందని పేర్కొన్నారు.
మోనజైట్ గింజల రూపంలో, పలు రంగులలో కనిపించిందన్నారు. ఇక్కడ ఉన్న ఆర్ఈఈ ఖనిజీకరణ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, 300 నమూనాలను సేకరించామని, మరింత జియో కెమికల్ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక తాజాగా దొరికిన అత్యంత విలువైన ఖనిజ లవణాలతో రాయలసీమను నిజంగానే రతనాల సీమ అని పలువురు స్థానికులు కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications