ఏపీలో పెరిగిన కొత్త కరోనా కేసులు: వందకుపైగా మరణాలు, తగ్గుతున్న యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 16వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేగాక, కరోనా మహమ్మారితో మరణించినవారి సంఖ్య కూడా వందకుపైగానే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 84,224 నమూనాలను పరీక్షించగా.. 16,167 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 16,167 కరోనా కేసులు, 104 మరణాలు
తాజాగా నమోదైన 16,167 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,43,557కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 104 మంది మృతి చెందారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాలో 13, విశాఖపట్నంలో 11 మంది, అనంతపురంలో 9 మంది, నెల్లూరులో 9 మంది, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 8 మంది చొప్పున, ప్రకాశంలో ఏడుగురు, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కడపలో ఒకరు మరణించారు.
దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 10,531కు చేరింది.

ఏపీలో రికవరీలు పెరగడంతో తగ్గుతున్న యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 21,385 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 14,46,244కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 1,86,728 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,89,24,545 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2967 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 562 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 1472, చిత్తూరులో 2967, తూర్పుగోదావరిలో 2325, గుంటూరులో 991, కడపలో 776, కృష్ణాలో 682, కర్నూలులో 981, నెల్లూరులో 1137, ప్రకాశంలో 1069, శ్రీకాకుళంలో 679, విశాఖపట్నంలో 1434, విజయనగరంలో 562, పశ్చిమగోదావరిలో 1092 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతిస్తున్నారు. వాహనాల రాకపోకలు కూడా 12 గంటలవరకే అనుమతిస్తున్నారు. తాజాగా, బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications