ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం.. 17 మందికి పాజిటివ్.. టెన్షన్లో తల్లిదండ్రులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. కేసులు సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి తెరచుకున్న పాఠశాలల్లో కరోనా వైరస్ కలవరపెడుతోంది. ప్రకాశం జిల్లాలోని పలు స్కూళ్లలో ఒకే రోజు 17 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది.
ఏపీలో స్కూల్స్ ఓపెన్
దేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ముంచుకోస్తుంది. రోజువారి కేసులు రెండున్నార లక్షలకు పైగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు జనవరి 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. కానీ ఆంద్రప్రదేవ్ ప్రభుత్వం మాత్రం సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్స్ ఓపెన్ చేసింది. విద్యార్థులు స్కూల్స్ కు హాజరుకావాల్సిందేననని పేర్కొంది. దీంతో తల్లిదండ్రులు ఒకవైపు కరోనా కలవరంతోనే తప్పనిసరి పరిస్థితులలో తమ పిల్లలకు స్కూల్స్ కు పంపిస్తున్నారు.
స్కూల్స్లో 17 మందికి కరోనా
తాజాగా పాఠశాలలకు కూడా కరోనా వైరస్ పాకింది. ప్రకాశం జిల్లాలో ఒకే రోజు పలు స్కూళ్లలో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . మంగళవారం 15 మంది ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో టెన్షన్ నెలకొంది. ప్రకాశం జిల్లాలో మంగళవారం కేసులు కూడా భారీగానే నమోదయ్యాయి. ఏకంగా 424 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒంగోలులోనే అత్యధికంగా 189 మంది వైరస్ బారిన పడ్డారు.
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు డీఆర్ఎం, ప్రభుత్వ బాలికోన్నతపాఠశాల, చిన్న గంజాం జెడ్పీ హైస్కూల్, అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో ఇద్దరి చొప్పున పాజిటివ్ గా నిర్థారణ అయింది. మార్కాపురం శారదా ఎయిడెడ్ పాఠశాల, కనిగిరి నందన మారెళ్ల, ఒంగోలు క్రేంద్రీయ విద్యాలయం, సింగరాయకొండ మండలం కలికివాయి, పంగులూరు మండలం రేణిగంవరం, యద్దనపూడి మండలం పూనూరు, టంగుటూరు మండలం కొణిజేడు, సంతమాగులూరు మండలం పుట్టావారి పాలెం స్కూళ్లలో ఒక్కొక్కరికి కరోనా సోకింది. యద్దనపూడి మండలం పూనురు , త్రిపురాంతకం మండలం మేడపి స్కూళ్లలో బోధనేతర సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.
Recommended Video
జగన్ సర్కార్పై సీరియస్..
ఒక వైపు కేసులు భారీగా పెరుగుతుంటే ప్రభుత్వం మొండితనంతో విద్యాసంస్థలను ఓపెన్ చేసిందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడున్నారు. పిల్లల స్కూళ్లకు పంపితేనే అమ్మఒడి డబ్బులు వస్తాయంటూ మెలికపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని టెన్షన్ నెలకొంది. అటు ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచిస్తోంది. పాఠశాలలకు కరోనా వ్యాప్తికి సంబంధం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అన్ని స్కూళ్లలో కరోనా నిబంధలకు అనుగుణంగా బోధన జరుగుతుందని చెప్పారు. కాగా ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై మండిపడతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని నేతలు దుయ్యబడుతున్నారు.