కరోనా అప్డేట్ : ఏపీలో కొత్తగా 19వేల పైచిలుకు కరోనా కేసులు... మరో 61 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 19,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 61 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 11,21,102కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 8053కి చేరింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 98,214 కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకూ 1,64,88,574 కరోనా టెస్టులు నిర్వహించారు. మరో 11,579 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 9,82,297 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,30,752 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2768 తూర్పు గోదావరిలో 2679 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 606 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన మరణాల్లో విజయనగరంలో 8 మంది,చిత్తూరు,తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున,అనంతపురంలో ఆరుగురు చొప్పున,ప్రకాశం,కర్నూలు,కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున నెల్లూరులో నలుగురు చొప్పున,గుంటూరు,కడప శ్రీకాకుళంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం ధరలు ఫిక్స్ చేసింది. NABH(National Accreditation Board for Hospitals) అక్రిడేషన్ కలిగిన ఆసుపత్రుల్లో నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ లేకుండా) చికిత్స కోసం రోజుకు రూ. 4000, అక్రిడేషన్ లేని ఆసుపత్రుల్లో రూ.3600 వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆక్సిజన్ సపోర్ట్తో కూడిన కరోనా ట్రీట్మెంట్కు అక్రిడేషన్ కలిగిన ఆస్పత్రుల్లో రోజుకు రూ.6,600, అక్రిడేషన్ లేని ఆస్పత్రుల్లో రోజుకు రూ.5,850 వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్రిడేషన్ కలిగిన ఆస్పత్రులకు ఐసీయూలో చికిత్స అందిస్తే రోజుకు రూ.12 వేలు, అక్రిడేషన్ లేని ఆస్పత్రుల్లో రూ.10,800 ఫీజుగా వసూలు చేయాలని తెలిపింది.
Recommended Video
క్రిటికల్ కేర్ చికిత్స (ఐసీయూ+వెంటిలేటర్) కోసం అక్రిడేషన్ కలిగిన ఆస్పత్రుల్లో రూ.16 వేలు, అక్రిడేషన్ లేని ఆస్పత్రుల్లో రూ.14,400 వసూలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఇలా ధరలు ఫిక్స్ చేసింది.