అమెరికాలో తెలుగు విద్యార్థులకు షాక్, కల తారుమారు: ఫేస్బుక్తో ఇరికిపోయారు
హైదరాబాద్: అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్థులకు ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు ఇరవై మంది తెలుగు విద్యార్థులను ఆదివారం చికాగో విమానాశ్రయం నుంచి అధికారులు వెనక్కి పంపించారు. దీనికి విద్యార్థులు ఫేస్బుక్లో పంచుకున్న సమాచారం కూడా కారణమని చెబుతున్నారు.
ఫేస్బుక్ తెలుగు విద్యార్థుల అమెరికా కలలను తారుమారు చేసింది. ఫేస్బుక్లో స్నేహితులకు పంపిన సమాచారం చివరి నిమిషంలో వారిని స్వదేశానికి తిప్పి పంపేలా చేసింది. విద్యార్థుల్ని అమెరికా అధికారులు వెనక్కి తిప్పి పంపడానికి ఫేస్బుక్ దోహదపడిందంటున్నారు.
వందల మంది కేవలం రెండు విశ్వవిద్యాలయాల్లోనే ఎందుకు చేరుతున్నారు? అదే అనుమానంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలుగు విద్యార్థుల ఫేస్బుక్ ఖాతాలను తనిఖీ చేశారు.
అందులో అమెరికాలో చదువుకోవడానికి అవసరమైన డబ్బును బ్యాంకు ఖాతాలో ఉండేలా ఎలా చక్కబెట్టింది, స్థిరాస్తులు ఉన్నట్లుగా ఎలా చూపింది.. తదితర సమాచారాన్ని స్నేహితులతో పంచుకున్నారు. వాటిని చూసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వెనక్కి పంపించారు.
ఫేస్బుక్లోని సమాచారంతో విద్యార్థుల స్థాయిని, మనస్తత్వాన్ని కూడా అంచనా వేసినట్లు చెబుతున్నారు. కాగా, గతంలో మూడు నాలుగు ప్రశ్నలు వేసి పంపించేవారని, ఇప్పుడు అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని కూడా చెబుతున్నారు.