'హైదరాబాద్' కావాలంటే 20 ఏళ్లు, తెలంగాణకు అధికారం లేదు: బాబు
హైదరాబాద్: ప్రత్యేక హోదా పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శాసన మండలిలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విభజన సందర్భంగా ఆస్తులు, అప్పుల పంపకాల్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు.
హైదరాబాద్ లాంటి రాజధాని రావాలంటే 20 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. రాజధానుల వల్లే రాష్ట్రాలకు ఆదాయం వస్తుందన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది తానే అని చెప్పారు.
ప్రత్యేక హోదాలో పరిశ్రమలకు రాయితీల అంశం లేదన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. విశాఖ - చెన్నై కారిడార్కు రూ.4500 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. గోదావరి ఏపీకి జీవనది అని, పోలవరాన్ని తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కోరామన్నారు. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు.
రాజధాని హైదరాబాదులో శాంతిభద్రతలకు సంబంధించిన అన్ని అధికారాలు గవర్నర్కే చెందుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేద్నారు.
పట్టిసీమ పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. పట్టిసీమ నుంచి ఈ ఏడాది 15-20 టీఎంసీల నీళ్లు తరలిస్తామన్నారు. పోలవరం నుంచి కృష్ణా డెల్టావరకు చాలా కాలువలు ఉన్నాయన్నారు. జనవరి నాటికి పుంగనూరు వరకు నీళ్లు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
రాయలసీమ చెరువులకు నీళ్లిస్తే కరవు పరిస్థితులు ఉండవన్నారు. రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, కృష్ణాడెల్టాకూడా ఇబ్బందుల్లో ఉందన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఏం చేస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వాలని విపక్షాలకు సూచించారు.