మహిళా టెక్కీ ఆత్మహత్య: బిల్డింగ్పై నుండి దూకిందా లేక..?
హైదరాబాద్: తాను పని చేస్తున్న కంపెనీ భవనం పై నుండి కిందపడి ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన హైదరాబాదులోని మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాప్రాల్ సాయికృపా కాలనీకి చెందిన సుదర్శన్ కుమార్ ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగి.
ఆయన కూతురు సుప్రియ హైటెక్ సిటీ సైబర్ పెరల్ భవనంలోని ఓ ఐటీ కంపెనీలో ఏడాదిన్నరగా పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం సాయంత్రం కంపెనీకి వచ్చిన సుప్రియ రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో టీ విరామానికి బయటకు వెళ్లారు.

అరగంట తర్వాత మళ్లీ కంపెనీలోకి వచ్చారు. ఆ తర్వాత రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో కంపెనీ భవనం బయటకు వెళ్లే మార్గంలో కింద గాయాలతో సుప్రియ పడి ఉన్నారు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
ఆమె చికిత్స పొందుతూ రాత్రి రెండున్నర గంటలకు మృతి చెందారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఎవరైనా తోసేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. కాగా, సుప్రియకు అదే కంపెనీకి చెందిన ఓ వ్యక్తితే ప్రేమ వ్యవహారం ఉందని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం.












Click it and Unblock the Notifications