ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు: ఆ ఆరు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులే, 3వేలకు యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల వ్యవధిలో 40,177 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 232 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,83,082కి చేరింది.
గడిచిన 24 గంటల్లో కరోనా చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 7,115కు చేరింది.
ఏపీ జిల్లాలవారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 17, చిత్తూరులో 56, తూర్పుగోదావరిలో 11, గుంటూరులో 27, కడపలో 4, కృష్ణాలో 40, కర్నూలులో 8, నెల్లూరులో 6, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 5, విశాఖపట్నంలో 20, విజయనగరంలో 3, పశ్చిమగోదావరిలో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక్క రోజు వ్యవధిలో 352 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,72,897కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3070 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,19,72,780 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఇక దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 9,58,125 నమూనాలను పరీక్షించగా.. 18,177 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,23,965కు చేరింది. కొత్తగా 20,923 మంది కరోనా నుంచి కోలుకోవడంతో.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 99,27,310కి చేరింది. దీంతో రికవరీ రేటు 96.16 శాతానికి చేరింది. గత 24 గంటల్లో 217 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,49,435కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,47,220 యాక్టివ్ కేసులున్నాయి.