ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు: గుంటూరులో అత్యధికం, 2వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,546 నమూనాలను పరీక్షించగా.. 246 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,92,986కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో కరోనా బారినపడి ప్రకాశం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7187 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 131 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,83,890కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1909 యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు..
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,46,74,210 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 5, చిత్తూరులో 45, తూర్పుగోదావరిలో 20, గుంటూరులో 58, కడపలో 12, కృష్ణాలో 37, కర్నూలులో 15, నెల్లూరులో 7, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 23,
విజయనగరంలో 7, పశ్చిమగోదావరిలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ.. మహారాష్ట్రలోనే సగం కంటే ఎక్కువ
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. గురువారం 39,726 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.15కోట్లకు చేరింది. కొత్తగా 20,654 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1.10 కోట్లమందికిపైగా చేరింది. గత 24 గంటల్లో 154 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,59,370కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,71,282 యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగం కంటే ఎక్కువగా మహారాస్ట్ర నుంచే ఉండటం గమనార్హం. గురువారం మహారాష్ట్రలో 25,853 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23 లక్షలు దాటింది. 58 మంది మరణించడంతో మృతుల సంఖ్య 53,138కి చేరింది. నిన్నటి వరకు ఆ రాష్ట్రంలో 1.67 లక్షల మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.