తాగించి యువకుడ్ని చంపి, రైల్వే ట్రాక్పై పడేశారు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని రామగుండం లక్ష్మీపురం గేట్కు చెందిన మొట్టుపల్లి చంద్రశేఖర రావు (27) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అతన్ని చంపేసి, శవాన్ని బుగ్గగుట్ట వద్ద రైల్వే ట్రాక్పై పడేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి వారు ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు. రైల్వే ట్రాక్పై కనిపించిన శవాన్ని తొలుత గుర్తించలేదు.
గుర్తు తెలియని శవంగా రైల్వే జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఎన్టీపిసి లక్ష్మిపురానికి చెందిన మొట్టుపల్లి చంద్రశేఖర్గా ఆ తర్వాత గుర్తించారు. ఘటనా స్థలాన్ని గోదావరిఖని డిఎస్పీ మల్లారెడ్డి, ఎన్టీపిసి సిఐ నారాయణ నాయక్, ఎస్ సాగర్, రామగుండం ఎస్ఐ విద్యాసాగర్ పరిశీలించారు.
వారం రోజుల క్రితమే చంద్రశేఖర్ను రైల్వే ట్రాక్ సమీపంలోని అడవిలో హత్య చేసి, శవాన్ని తీసుకుని వచ్చి రైల్వే ట్రాక్పై పడేసినట్లు పోలీసులు గుర్తించారు. కుళ్లిన మృతదేహానికి రైల్వే పోలీసులు పోస్టుమార్టం చేయించి, బంధువులకు అప్పగించారు.
అవివాహితుడైన చంద్రశేఖర్ ఎన్టీపిసిలో ప్రైవేట్ వెల్డర్గా పనిచేసేవాడు. ద్విచక్రవాహనంపై 16వ తేదీన వెళ్లిన తమ కుమారుడు కనిపించడం లేదని చంద్రశేఖర్ తండ్రి రవీందర్ రావు ఎన్టీపిసి పోలీసులకు ఈ నెల 17వ తేదీన ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో రాత్రి రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని శవం కనిపించింది. రైల్వే పోలీసులు, ఎన్టీపిసి పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న దుస్తుల ఆధారంగా చంద్రశేఖర్ను గుర్తించారు.
గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తులు అతడిని బుగ్గ అడవుల్లోకి తీసుకుని వెళ్లి మద్యం తాగించి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజీవ్ రహదారికి కూతవేటు దూరంలోనే ఈ హత్య జరిగింది.