ఏపీలో భారీగా తగ్గిన కొత్త కరోనా కేసులు: 4వేల దిగువకు యాక్టివ్ కేసులు, ఆ 2 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా 400కు దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 27,641 నమూనాలను పరీక్షించగా.. 295 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది. కేసులు తక్కువ కావడానికి టెస్టుల సంఖ్య కూడా తగ్గడం ఒక కారణంగా తెలుస్తోంది.
ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు, ఏడుగురు మృతి
కొత్తగా నమోదైన 295 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,63,872కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఏడుగురు మృతి చెందారు.
కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,350కి పెరిగింది.
ఏపీలో 4830కు తగ్గిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 560 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,44,692కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 4,830 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,92,91,896 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 69 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు.
ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 00, చిత్తూరులో 40, తూర్పుగోదావరిలో 69, గుంటూరులో 31, కడపలో 13, కృష్ణాలో 68, కర్నూలులో 01, నెల్లూరులో 16, ప్రకాశంలో 19, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 22, విజయనగరంలో 00, పశ్చిమగోదావరిలో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,93,301, చిత్తూరులో 2,46,459 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,914) కరోనా కేసులున్నాయి.
Recommended Video
దేశంలోనూ భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 9.98,397 నమూనాలను పరీక్షించగా.. 14,306 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.41కోట్లకు చేరింది. అంతకుముందు రోజు కంటే 500కుపైగా కేసులు తక్కువగా నమోదు కావడం గమనార్హం. అయితే, అదే సమయంలో టెస్టులు కూడా తగ్గాయి. ఆదివారం 443 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 4,54,712కు చేరింది. దేశంలో అత్యధిక మరణాలు కేరళలోనే నమోదవుతున్నాయి. ఆదివారం 18,762 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 3.35 కోట్లకుపైగా చేరింది. ప్రస్తుతం దేశంలో 1,67,695 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో రికవరీ రేటు 98.18 శాతానికి చేరింది. పాజిటివిటీ రేటు 0.49 శాతంగా ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఆదివారం 12,30,720 మందికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 102 కోట్లకు చేరింది.