దిమ్మతిరిగే తీర్పు..! ప్రేమ పేరుతో మోసగించినందుకు
అనంతపురం : ప్రేమ.. ప్రేమ.. అని వెంటపడడం.. తీరా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి ప్లేటు ఫిరాయించేయడం.. ఈరోజుల్లో చాలామంది ఆకతాయిలకు అలవాటయిపోయింది. అయితే ఇలాంటివారి ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా దిమ్మతిరిగే తీర్పు ఇచ్చింది అనంతపురం కోర్టు.
ప్రేమ అంటూ వెంటపడి.. వేధించి.. తీరా ప్రేమించాక పెళ్లికి మాత్రం ససేమిరా అనడంతో ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. అక్కడి నుంచి విషయం కోర్టు మెట్లు ఎక్కడంతో సదరు నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. అనంతపురం జిల్లా కక్కలపల్లి గామానికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన గాండ్ల చంద్రశేఖర్ అనే ఆటో డ్రైవర్ ప్రేమ పేరుతో కొంతకాలంతో వేధించాడు. ఆమె కాలేజీకి వెళుతున్నపుడు.. తిరిగి వస్తున్నప్పుడు.. మార్గ మధ్యలో ఆమెను వెంబడించడం చేసేవాడు. ఇదే క్రమంలో పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో.. చంద్రశేఖర్ ను నమ్మిన యువతి అతడిని ప్రేమించింది.
ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నా.. తీరా పెళ్లి మాటేత్తేసరికి మాత్రం ప్లేటు ఫిరాయించేశాడు చంద్రశేఖర్. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో.. 2012 మే 7వ తేదీన నిందితుడు చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అనంతరం కేసును కోర్టులో ప్రవేశపెట్టడంతో.. కేసు పూర్వ పరాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10వేల ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. స్థానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి గీతావాణి ఈ తీర్పును వెలువరించారు.