బెజవాడ: ఓ వైపు సింధుకు సన్మానసభ, మరోవైపు బెంజి సర్కిల్లో ఘోర రోడ్డు ప్రమాదం
అమరావతి: ఓ వైపు కృష్ణా పుష్కరాలు, మరోవైపు రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు ఘన సన్మానం... ఈ రెండు కార్యక్రమాలతో నవ్యాంధ్ర రాజధానిగా సేవలందిస్తోన్న విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో పుష్కరాల చివరి రోజు బెజవాడలో విషాదం చోటుచేసుకుంది.
బెంజ్ సర్కిల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విశాఖపట్నంకు వెళుతున్న ఓ కారు వేగంగా దూసుకువచ్చి డివైడర్ను ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో మహిళతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు.
కృష్ణా పుష్కరాల్లో చివరి రోజు కావడంతో పుష్కర స్నానం చేసిన అనంతరం తిరిగి సొంతూరుకు వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన కారు నెంబర్ ఏపీ 30పీ 4789గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమిది ప్రయాణికులు ఉన్నారు.

మృుతులు, క్షతగాత్రులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనతో బెజవాడలో ఒక్కసారిగా విషాధ ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను బెజవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉంటే కృష్ణా పుష్కరాల చివరి రోజైన మంగళవారం తెలుగు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లకు యాత్రికులు పోటెత్తారు. విజయవాడలోని పున్నమిఘాట్, దుర్గా ఘాట్, పద్మావతి ఘాట్, పవిత్ర సంగమం ఘాట్ సహా గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని పలు ఘాట్లలో వేలాది మంది భక్తులు పుష్కర స్నానాలు చేస్తున్నారు.
పుష్కరాలు చివరి రోజు కావడంతో పున్నమిఘాట్లో పలువురు వీఐపీలు మంగళవారం ఉదయం పుష్కరస్నానం ఆచరించారు. మంత్రులు దేవినేని ఉమ, శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి, సినీ నిర్మాత అశోక్కుమార్, నటుడు సాయికుమార్ తదితరులు పుష్కర స్నానం చేసిన వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications