ఏపీ: ఒక్కరోజులో రికార్డుస్థాయిలో పెరిగిన కరోనా కేసులు, మరో రెండు మరణాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

6456కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తాజాగా నమోదైన 304 కరోనా పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6456కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 14,477 నమూనాలను పరిశీలించగా 304 కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 246. ఇతర రాష్ట్రాలు 52, విదేశాల నుంచి వచ్చిన 6 కేసులతో కలిపితే 304 అని వెల్లడించింది.

రెండు మరణాలు.. 2231 యాక్టివ్ కేసులు
గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం, కర్నూలులో ఈ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరింది. తాజాగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 47 కాగా, రాష్ట్రంలో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2770కి చేరింది. 2231 యాక్టివ్ కేసులున్నాయి.

ఇతర రాష్ట్రాలు, విదేశాల కేసులు
కాగా, రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కుమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 1159 కాగా, వీటిలో యాక్టివ్ కేసులు 567 ఉన్నాయి. అలాగే విదేశాల నుంచి వచ్చిన 210 మందికి కరోనా సోకినట్లు తెలిపింది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తోంది.
Recommended Video

దేశంలో మూడున్నర లక్షల కేసుల దిశగా..
ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 3,33,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,53,876 యాక్టివ్ కేసులున్నాయి. 1,69,817 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 9524 మంది కరోనాతో మరణించారు. కాగా, ప్రతిరోజు దాదాపు కొత్తగా 10వేల కేసులు నమోదవుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications