అసలు కారణం ఇదీ: అమరావతిలో మొత్తం 36 టౌన్ షిప్పులు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి చుట్టూ లెక్కకు మించి టౌన్ షిప్పులు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అమరావతి చుట్టుప్రక్కల మొత్తం 27 టౌన్ షిప్పులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అయితే తాజాగా మంత్రి, సీఆర్డీఏ ఉపాధ్యక్షుడు నారాయణ అమరావతి చుట్టూ నిర్మించదలచిన ఔటర్ రింగురోడ్డుకు ఆనుకుని మరో 9 టౌన్ షిప్పులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో ఇప్పుడు ఈ సంఖ్య 36కు చేరింది.
అమరావతి కోసం భూములను ఇచ్చిన ప్రజల్లో కొన్ని గ్రామాల వారు రాజధాని లోని కీలక నిర్మాణాలన్నీ కృష్ణానది ఒడ్డున ఉన్న కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమితం కానున్నాయన్న ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు అన్ని గ్రామాలూ సమానమేనని, తదనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందుతోంది మంత్రి నారాయణ తెలిపారు.
అయినా కృష్ణానదికి దూరంగా ఉన్న కొన్ని మెట్ట గ్రామాల రైతుల్లో నెలకొన్న సందేహాలు పూర్తిగా తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో 9 థీమ్ సిటీలను అన్ని గ్రామాలూ 'కవర్' అయ్యేలా ప్రతిపాదించారు.
వీటితో పాటు ప్రతి థీమ్ సిటీలోనూ ఒక్కొక్క దాంట్లో మూడు చొప్పున అమరావతిలో మొత్తం 27 టౌన్ షిప్లను నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా అమరావతి చుట్టూ 210 కిలోమీటర్ల పొడవున భారీస్థాయిలో నిర్మించాలనుకుంటున్న ఔటర్ రింగురోడ్డు కోసం అవసరమైన ఏడు వేల ఎకరాలను రాజధాని కోసం సమీకరించింది.
దీంతో మరో 9 టౌన్ షిప్పులు ఏర్పాటు చేసేందుకు అవకాశం లభించింది. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు అమరావతిలో ప్లాట్లను ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానికి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ విధానాన్నే ఔటర్ భూముల విషయంలో పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఇప్పటికే రాజధాని నిర్మాణావసరాలు, ఇతర కేటాయింపులకు గాను మొత్తం 54,000 ఎకరాల్లో మిగిలేది కొంత అయినందున ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములు ఇచ్చే రైతులకు అందులో ప్లాట్లను ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు.
అందుకే ప్రత్యామ్నాయంగా ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములను ఇచ్చిన రైతులకు కేటాయించబోయే ప్లాట్లను ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే నిర్మించనున్న 9 టౌన్ షిప్పులలో ఇస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు.