ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 5వేలకు యాక్టివ్ కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా, 500కి దిగువనే కేసులు నమోయ్యాయి. గత రెండు రోజులతో పోలిస్తే స్వల్పంగా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 40,191 నమూనాలను పరీక్షించగా.. 483 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 483 కరోనా కేసులు, నలుగురు మృతి
కొత్తగా నమోదైన 483 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,61,287కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి నలుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,317కి పెరిగింది.

ఏపీలో 5వేలకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 534 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,41,316కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 5,654 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,90,56,256 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 120 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అనంతపురం, కడప, విజయనగరం జిల్లాల్లో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 02, చిత్తూరులో 120, తూర్పుగోదావరిలో 25, గుంటూరులో 61, కడపలో 02, కృష్ణాలో 81, కర్నూలులో 03, నెల్లూరులో 32, ప్రకాశంలో 55, శ్రీకాకుళంలో 15, విశాఖపట్నంలో 32, విజయనగరంలో 02, పశ్చిమగోదావరిలో 53 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,92,950, చిత్తూరులో 2,45,956 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,872) కరోనా కేసులున్నాయి.

దేశంలో క్షీణిస్తున్న యాక్టివ్ కేసులు, 100 కోట్లకు చేరువలో వ్యాక్సినేషన్
దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్త కేసులు 231 రోజులు, యాక్టివ్ కేసులు 227 రోజుల కనిష్టానికి క్షీణించడం గమనార్హం. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో 11,81,314 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 13,058 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 3,40,94,373కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 164 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,52,454కు పెరిగింది. సోమవారం 19,470 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి క్షేమంగా బయటపడినవారి సంఖ్య ,34,58,801కి పెరిగింది. కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,83,118కి తగ్గింది. దేశంలో రికవరీ రేటు 98.14 శాతానికి పెరగ్గా.. పాజిటివిటీ రేటు 0.54 శాతానికి తగ్గింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సోమవారం 87,41,160 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 98 కోట్లను దాటింది. మరో ఒకటి రెండు రోజుల్లో ఈ సంఖ్య 100 కోట్లను దాటే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications