ఏపీలో కరోనా కల్లోలం: 5వేలకుపైగా కొత్త కేసులు, 3 జిల్లాల్లో 600కుపైగా, 30వేలు దాటిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే 5వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 35,741 నమూనాలను పరీక్షించగా.. 5086 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 5వేలకుపైగా కరోనా కేసులు
తాజాగా నమోదైన 5086 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,42,135కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 14 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మరణించారు. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 7,353కి చేరింది.
ఏపీలో భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1745 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 9,03,072కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,710 యాక్టివ్ కేసులున్నాయి.
చిత్తూరు, కర్నూలు, గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,55,70,201 కరోనా నమూనాలను పరీక్షించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 835, కర్నూలు జిల్లాలో 626, గుంటూరు జిల్లాలో 611 కరోనా కేసులు నమోదు కాగా, అల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే పశ్చిమగోదావరి, కడప జిల్లా మినహా 12 జిల్లాల్లో 200కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురంలో 334, చిత్తూరులో 835, తూర్పుగోదావరిలో 450, గుంటూరులో 611, కడపలో 96, కృష్ణాలో 396, కర్నూలులో 626, నెల్లూరులో 223, ప్రకాశంలో 236, శ్రీకాకుళంలో 568, విశాఖపట్నంలో 432, విజయనగరంలో 248, పశ్చిమగోదావరిలో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. కాగా, రాష్ట్రంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.