అతివేగానికి అయిదుమంది బలి: జగ్గయ్యపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
విజయవాడ: కృష్ణా జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఈ తెల్లవారు జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆరు నెలల చిన్నారి కూడా ఉంది. అన్నప్రాసన కోసం కుటుంబ సమేతంగా జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు.
మృతులను కుటుంబరావు, ఇందిరా, మేరీ, జోషి, ఆరునెలల చిన్నారి ప్రిన్సీగా గుర్తించారు. హైదరాబాద్ చందానగర్ హుడా కాలనీకి చెందిన కుటుంబరావు తన మనవరాలు ప్రిన్సీ అన్నప్రాసన కోసం శనివారం రాత్రి కారులో జంగారెడ్డిగూడెేనికి బయలుదేరారు. ఈ తెల్లవారు జామున మార్గమధ్యలో జగ్గయ్యపేట వద్ద కారు ప్రమాదానికి గురైంది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై చిల్లికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరవరం వద్ద అదుపు తప్పి అతివేగంగా కల్వర్టును ఢీ కొట్టింది.
కారు మొత్తం నుజ్జునుజ్జయింది. ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో నలుగురు సంఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డారు. నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారంటే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. అతివేగం, నిద్రమత్తు వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుని ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు.