విషాదం:విషపూరితమైన గడ్డి తిని...56 గోవులు మృతి
గుంటూరు: పురుగుమందుల కారణంగా విషపూరితమైన గడ్డితిని 56 ఆవులు మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లా గురజాల మండలం తేలుకుట్ల గ్రామంలో జరిగింది. గడ్డి విషతుల్యమైన విషయం తెలియక మేత మేసిన మూగ జీవులు ఈ విధంగా భారీ సంఖ్యలో మృత్యువాతన పడటం అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే...
తెలంగాణ రాష్ట్రం నేరేడుబొమ్మ మండలం కాచరాజుపల్లి గ్రామానికి చెందిన గుండాల లక్ష్మయ్యకు 100 ఆవుల మంద ఉంది. వీటిని ఇతడు గత కొంత కాలంగా గుంటూరు జిల్లా గురజాల మండలం అంబాపురం గ్రామ పొలాల వద్దకు తోలుకు వచ్చి మేపుకొంటున్నాడు. ఎప్పటిలాగానే ఆదివారం సాయంత్రం ఆ గ్రామంలో ఆవులు మేత మేయడం పూర్తయ్యాక స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే తేలుకుట్ల గ్రామం చేరుకునే సరికే చీకటి పడిపోవడంతో అక్కడే ఆగిపోయాడు.
ఈక్రమంలో ఆవులు పక్కనే ఉన్న పంట కోసిన జొన్న చేనులో మిగిలివున్న ఉంగిడి గడ్డిని మేస్తున్నాయి. ఆ గడ్డి తిన్న కొంతసేపటికే 100 గోవులన్నీ అస్వస్థతకు గురికాగా వాటిలో 56 ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. ఇలా గోవులు మృత్యువాతన పడుతున్న సమాచారం తెలియడంతో గురజాల పశుసంవర్ధక శాఖ ఏడీ మద్దు హనుమంతురావు సంఘటన స్థలానికి వెళ్లి వెంటనే ఆవులకు చికిత్స అందించడంతో సుమారు 21 ఆవులు కోలుకుని మరణం నుంచి తప్పించుకున్నాయి.
ఉంగిడి గడ్డిలో హెచ్సీఎన్ ఆనే విష పదార్థం ఉండడంతో అది తిన్న ఆవులు వెంటనే మృత్యువాతన పడినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. మృతి చెందిన ఆవుల విలువ రూ.12 లక్షల పైనే ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మరో 24 ఆవులు విష ప్రభావం వల్ల కలిగిన నొప్పితో పరుగులు తీసాయని, వాటి ఆచూకి ఇంకా తెలియలేదని బాధిత రైతు తెలిపాడు.