ఏపీలో పది పరీక్షలు, జూలై 10 నుంచి ఆరురోజులు, 11 పేపర్లు ఆరింటికీ కుదింపు, వంద మార్కులు..
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆరురోజులు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నది. కరోనా వైరస్ వల్ల పేపర్ల సంఖ్యను మాత్రం కుదించింది. 11 పేపర్లు కాస్త ఆరు పేపర్లకు తగ్గించింది. ఒక్కో పేపర్ వంద మార్కులు అని తెలిపింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నాం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టంచేసింది.
10వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్,11న సెకండ్ లాంగ్వేజ్, 12న ఇంగ్లీష్, 13న మ్యాథ్స్, 14న జనరల్ సైన్స్, 15న సోషల్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలను కూడా పెంచుతున్నట్టు పేర్కొన్నది. 6.39 లక్షల మంది విద్యార్థుల కోసం 1500 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ వల్ల భౌతిక దూరం పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో సెంటర్ల సంఖ్య 2009 వరకు ఉండనుందని తెలుస్తోంది.
ఒక్కో గదిలో తక్కువ మందికి పరీక్ష నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ అధికారులు తెలిపారు. 12 మంది వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. పరీక్ష రాసే విద్యార్థులు విధిగా మాస్క్ ధరించాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద కూడా శానిటైజర్లు ఉంచుతామని.. విద్యార్థుల భవిష్యత్ కోసం పకడ్బందీగా పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.