కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుమంది అక్కడికక్కడే: ఆళ్లనాని దిగ్భ్రాంతి
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పందించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సదుపాయాన్ని కల్పించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
కృష్ణాజిల్లా నూజివీడు సమీపంలోని గొల్లపల్లి వద్ద ఈ తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తోన్న ఆటోను లారీ అదుపు తప్పి వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తోన్న వారిలో ఆరుమంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా నూజివీడు లయన్ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని విజయవాడ, నూజివీడు ఆసుపత్రులకు తరలించారు.

ఈ ఘటనపై ఆళ్ల నాని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కూలీలు మృతి చెందడం తనను కలిచివేసిందని అన్నారు. క్షతగాత్రులకు విజయవాడ, నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యాన్ని అందించాలని కృష్ణా జిల్లా డిఎంహెచ్ఒ డాక్టర్ సుహాసిని, విజయవాడ గవర్నమెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్ను ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని అన్నారు. గాయపడ్డ వారికి ఖరీదైన వైద్యాన్ని అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications