ఏపీలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు: ఆ మూడు జిల్లాల్లో ఒక్క కేసూ లేదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో 21,922 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 64 మందికి మాత్రమే కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,87,900కు చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.
కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 7154కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 99 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 8,79,504కు చేరింది. ప్రస్తుత రాష్ట్రంలో 1242 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,31,59,794 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక ఏపీ జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా కేసులను గమనిస్తే.. అనంతపురంలో 4, చిత్తూరులో 4, తూర్పుగోదావరిలో 15, గుంటూరులో 7, కడపలో 4, కృష్ణాలో 9, కర్నూలులో 2, నెల్లూరులో 8, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 5,04,263 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 11,427 కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 1,07,57,610కి చేరింది. ఈ మేరకు వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్క రోజు వ్యవధిలో 118 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,54,392కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,68,235 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications