ఏపీలో తగ్గిన తాజా కరోనా కేసులు: 3 లక్షలకు చేరువలో, కోలుకున్నవారూ ఎక్కువే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిస్తోంది. ఎందుకంటే.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6780 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, గత కొద్ది రోజులుగా 9వేలు, 10వేల కరోనా కేసులు నమోదు కాగా.. తాజాగా 6వేల కేసులు మాత్రమే బయటపడటం గమనార్హం.

ఏపీలో 3లక్షలకు చేరువలో కరోనా కేసులు..
తాజాగా నమోదైన 6780 కరోనా పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,96,609కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 44,578 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తం 29,05 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84,777 యాక్టివ్ కేసులున్నాయి.

రెండు లక్షలకుపైగా మంది కోలుకున్నారు..
గత 24 గంటల్లో 7866 మంది కోలుకోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,09,100 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా గత 24 గంటల్లో 82 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2732 మంది మరణించారు.

ప్రకాశంలో అత్యధికంగా మరణాలు..
ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 13 మంది మరణించగా, తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది, చిత్తూరు జిల్లాలో 8 మంది, గుంటూరు, కడప జిల్లాల్లో ఏడుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మృత్యువాతపడ్డారు.

జిల్లాల వారీగా కొత్త కేసులు.. యాక్టివ్ కేసులూ ఎక్కువే..
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 535, చిత్తూరులో 458, తూర్పుగోదావరిలో 911, గుంటూరులో 776, కడపలో 523, కృష్ణాలో 135, కర్నూలులో 372, నెల్లూరులో 481, ప్రకాశంలో 357, శ్రీకాకుళంలో 527, విశాఖపట్నంలో 519, విజయనగరంలో 462, పశ్చిమగోదావరి జిల్లాలో 724 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే అత్యధిక యాక్టివ్ కేసులుండటం గమనార్హం. అంతేగాక, అత్యధిక పరీక్షలు చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత స్థానంలో ఏపీనే ఉంది.












Click it and Unblock the Notifications