జగన్ సభ రోజే 7వేల మందికి: కొనుగోలు 'ఆస్తులు' చూపిన లోకేష్, ఇస్తానని సవాల్
హైదరాబాద్: ఉద్యోగాలు ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో సభ పెట్టిన రోజే... అదే ప్రాంతంలో సెల్కాన్, కార్బన్, మైక్రోమాక్స్ సెల్ఫోన్ కంపెనీలకు భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని టిడిపి నేత నారా లోకేష్ చెప్పారు.
ఆయన శనివారం తమ కుటుంబం ఆస్తుల వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సంద్రభంగా మాట్లాడుతూ... పై మూడు కంపెనీలలో ఏడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తులు రూ.61.25 కోట్లు, అప్పులు రూ.15.30 కోట్లు.. ఆస్తుల నుంచి అప్పులు పోను నికర ఆస్తి విలువ రూ.45.95 కోట్లు అని నారా లోకేశ్ శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే.

గత ఏడాదితో పోలిస్తే అప్పులు కొంతమేర తగ్గి ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. తన తండ్రి చంద్రబాబు 2011 నుంచి కుటుంబ ఆస్తులను ప్రకటిస్తున్నారని, 2014లో ఆస్తుల వెల్లడి సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై కుటుంబ సభ్యులే ప్రకటిస్తారని పేర్కొన్న మేరకు ఈ ఏడాది తాను ప్రకటిస్తున్నానని లోకేశ్ తెలిపారు.
ఆస్తుల కొనుగోలు విలువలను చూపిస్తున్నామని, మార్కెట్ విలువ ఎప్పటిప్పుడు మారుతుంది కాబట్టి దాన్ని పేర్కొనలేదన్నారు. ఐదేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నామని, ఇవి కాకుండా ఏమైనా ఉన్నట్లు ఎవరైనా ఆధారాలు చూపిస్తే వారికే రాసిస్తామన్నారు.
తమపై ఆరోపణలు చేసేవారు వారి ఆస్తులను ప్రకటించాలని.. కాంగ్రెస్, వైసిపి, తెరాస తదితర పార్టీల అధ్యక్షులూ వారివారి ఆస్తులను ప్రకటించాలనేది తన కోరిక అన్నారు. ఈ పద్ధతి అవినీతి నియంత్రణకు తోడ్పడుతుందన్నారు.
తమలా అంతా ఆస్తులు ప్రకటించి ఆదర్శంగా నిలవాలన్నారు. హెరిటేజ్ సంస్థ 3 లక్షల మంది రైతుల నుంచి పాలు సేకరిస్తూ 4,244మందికి ప్రత్యక్షంగా, 15వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. ఈ ఏడాది రూ.2072 కోట్ల లావాదేవీలతో రూ.30 కోట్ల నికరలాభం ఆర్జించిందన్నారు.
తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, రాజస్థాన్లలో పాల సేకరణ చేస్తున్నామని, ఇటీవలే దిల్లీలో కూడా ప్రారంభించామన్నారు. ప్రభుత్వం నుంచి నిబంధనలకు విరుద్దంగా ఏ లబ్ధీ పొందలేదన్నారు. ఇతరుల్లా ఇనుము, సిమెంటు, పత్రిక తదితర వ్యాపారాలు కాకుండా పాలు, కూరగాయల వ్యాపారంతో సంతృప్తిగా ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications