Amaravati పరిధిలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం: ఉత్తరాంధ్రలో కొత్త పంచాయతీలు.. !
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడదానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిరసనగా అమరావతి గ్రామాల రైతుల ఉద్యమిస్తోన్న వేళ.. కీలక ప్రకటన వెలువడింది. అమరావతి పరిధిలోని ఎనిమిది గ్రామ పంచాయతీలను తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చింది. మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఫలితంగా- ఆయా పంచాయతీలన్నీ ఇక వార్డులుగా రూపాంతరం చెందుతాయి.

అమరావతి స్వరూపం మారినట్టే..
ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ గురువారం సాయంత్రం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఆ నోటిఫికేషన్ ప్రభావం వల్ల అమరావతి గ్రామాల పరిధిల స్వరూపం కొంతవరకు మారిపోయినట్టయింది. దీనితో పాటు.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎంపిక చేసిన కొన్ని గ్రామాలకు పంచాయతీ హోదాను కల్పించింది ప్రభుత్వం.

తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలివే..
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ నేపథ్యంలో- రాజధాని అమరావతి పరిధిలోని ప్రాతూరు, వడ్డేశ్వరం, పెనుమాక, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావూరు, గుండిమేడ, ఉండవల్లి పంచాయితీలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలన్నీ గుంటూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. తాడేపల్లి మున్సిపాలిటీలో చేర్చడం వల్ల అవన్నీ వార్డులుగా మారిపోతాయి. పట్టణ హోదా కల్పించినట్టయింది.

మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తోన్న పరిస్థితుల్లో..
రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు కొనసాగిస్తోన్న ఉద్యమం 50 రోజులు దాటిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తాజాగా ఈ నోటిఫికేషన్ను జారీ చేయడం చర్చనీయాంశమైంది. జగన్ సర్కార్ మరో వివాదానికి తెర తీసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాలే లేకుండా చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉద్యమాన్ని అడ్డుకోవడానికి కొత్త ఎత్తుగడను వేసిందని విమర్శిస్తున్నారు.

తాడేపల్లి మున్సిపాలిటీ స్వరూపం ఇదీ..
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి ప్రాంతాన్ని మున్సిపాలిటీగా మార్చుతూ గత ఏడాది జనవరి 5వ తేదీన అప్పటి చంద్రబాబు ప్రభుత్తం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. దీని విస్తీర్ణం 19 చదరపు కిలోమీటర్లు. సుమారు 80 వేల మంది ఈ మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నారు. వారిలో 47 శాతం మంది ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. మంగళగిరి మున్సిపాలిటీ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సరిహద్దులను ఆనుకుని ఉంటుందీ ప్రాంతం. తాజాగా ఎనిమిది గ్రామ పంచాయతీలను ఇందులో విలీనం చేయడంతో పరిధి మరింత పెరిగినట్టయింది.

ఉత్తరాంధ్రలో కొత్త పంచాయతీలు
కాగా- ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని సాధారణ గ్రామాలకు పంచాయతీల హోదాను కల్పించింది. శ్రీకాకుళం జిల్లాలోని కాకరాగూడ, దుగనపుట్టుగ, అక్కివరం, మహర్థాపురం, ఎం రాజాపురం, కంబార వసల, ఎం అవలంగి, విజయనగరం జిల్లాలోని సదానందపురం, నరసయ్య పేట, కొత్త శ్రీరంగరాజపురం, రంగాపురం గ్రామాలకు పంచాయతీల హోదాను కల్పిస్తూ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది.












Click it and Unblock the Notifications