ఏపీ అసెంబ్లీలో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్- పోలవరంపై జగన్ చర్చను అడ్డుకున్నందుకు
ఏపీ అసెంబ్లీలో ఇవాళ పోలవరం ప్రాజెక్టుపై చర్చ తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది. టీడీపీ, వైసీపీ సభ్యులు పోలవరంపై వాగ్వాదానికి దిగారు. ముందుగా జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చర్చను ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిపై స్పందించిన సీఎం జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఇవాళ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీలో కరోనా- ఎమ్మెల్యే కారుమూరికి పాజిటివ్- చీరలు తీసుకున్న వారిలో భయం..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశం ఇవాళ ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. పోలవరం ప్రాజెక్టును దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించారని, అనంతరం చంద్రబాబు హయాంలో ఆయన కేంద్రం ఈ ప్రాజెక్టు చేపట్టకుండా తానే చేపడతానని అంగీకరించారని, దాని ప్రకారం కూడా పనులు పూర్తి చేయలేకపోయారని జలవనరులశాఖ మంత్రి అనిల్ యాదవ్ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు తన హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టామని, అంతకుముందు వైఎస్ హయాంలో టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదని గుర్తుచేశారు. ఈ అంశంపై తీవ్ర వాగ్యుద్ధం సాగింది.
అనంతరం పోలవరం ప్రాజెక్టుపై సమాధానం ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధం కాగానే చంద్రబాబ సహా టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని, కేంద్రం నుంచి తీసుకుని కూడా పనులు పూర్తి చేయలేక చేతులెత్తేశారని ఆరోపించారు. సీఎెం ప్రసంగానికి టీడీపీ ఎమ్మెల్యేలు పదేపదే అడ్డుతగిలారు. చంద్రబాబు మినహా ఇతర ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి తీవ్ర నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, ఏలూరి సాంబశివరావు, వేగుళ్ల జోగేశ్వరరావు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, బెందాళం అశోక్, అనగాని సత్యప్రసాద్ ను సస్పెండ్ చేశారు.