ఏపీలో 1000లోపే కొత్త కరోనా కేసులు: భారీగా తగ్గిన పరీక్షలు, 17వేలకు యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 1000కి దిగువనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 46,962 నమూనాలను పరీక్షించగా.. 909 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది. అంతకుముందు రోజు కంటే కరోనా కొత్త కేసులతోపాటు టెస్టులు కూడా భారీగా తగ్గడం గమనార్హం.
Recommended Video

ఏపీలో కొత్తగా 909 కరోనా కేసులు, 13 మంది మృతి
తాజాగా నమోదైన 909 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,94,606కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 13 మంది మృతి చెందారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ముగ్గురు మరణించగా, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,660 మృతి చెందారు.

ఏపీలో 17,218 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1543 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,63,728కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 17,218 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,57,08,411 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 241 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా అనంతపురం జిల్లాలో 5 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 05, చిత్తూరులో 107, తూర్పుగోదావరిలో 241, గుంటూరులో 82, కడపలో 40, కృష్ణాలో 47, కర్నూలులో 08, నెల్లూరులో 174, ప్రకాశంలో 86, శ్రీకాకుళంలో 28, విశాఖపట్నంలో 61, విజయనగరంలో 09, పశ్చిమగోదావరిలో 21 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,82,949, చిత్తూరులో 2,35,195 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,857) కరోనా కేసులున్నాయి. మరోవైపు ఏపీలో సోమవారం నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు హాజరయ్యారు. కరోనా నిబంధనలను పాటిస్తూనే తరగతులు నిర్వహించారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు 90 శాతం వరకు వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఈరోజే సీఎం జగన్ .. జగనన్న విద్యా కానుకను ప్రారంభించారు.

దేశ వ్యాప్తంగా తగ్గిన కొత్త కరోనా కేసులు
ఇది ఇలా ఉండగా దేశంలోనూ కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 11,81,212 నమూనాలను పరీక్షించగా.. 32,937 మందికి కరోనా సోకినట్లు తేలింది. ముందు రోజు కంటే 8.7 శాతం మేర కేసులు తగ్గాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.22 కోట్లకు చేరాయి. ఇక ఆదివారం 417 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 4,31,642కు చేరింది.
అయితే, కరోనా నిర్ధారణ పరీక్షలు తగ్గడం కూడా కొత్త కేసుల తగ్గుముఖానికి ఓ కారణంగా తెలుస్తోంది. గత 24 గంటల వ్యవధిలో కరోనా నుంచి 35,909 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనావైరస్ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.14 కోట్ల మంది వైరస్ను జయించారు. రికవరీ రేటు 97.48 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,81,947 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.19 శాతానికి తగ్గింది. ఆదివారం సెలవు రోజు కావడంతో వ్యాక్సినేషన్ కొద్దిగా నెమ్మదించినట్లు తెలుస్తోంది. ఆదివారం 17,43,114 మందికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 54.58,57,108కు చేరింది. మహారాష్ట్రతోపాటు చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండగా, కేరళ రాష్ట్రంలో మాత్రం మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు. దేశంలో కొత్త నమోదవుతున్న కేసుల్లో సగం కేరళ నుంచే ఉండటం గమనార్హం. కేరళలో ఆదివారం 18,582 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36.69 లక్షలకు చేరింది. తాజాగా, 102 మంది మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 18,601కి పెరిగింది. రాస్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా పది శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు, తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 50,126 కరోనా పరీక్షలు నిర్వహించగా, 245 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 52, కరీంనగర్ జిల్లాలో 30 కొత్త కేసులు నమోదయ్యాయి. యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 582 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్కరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,52,380 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,41,270 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,268 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనా మరణాల సంఖ్య 3,842కి పెరిగింది.












Click it and Unblock the Notifications