ఏపీలో కరోనా విలయం: 10వేలకు చేరువలో కొత్త కేసులు, 60వేలు దాటిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే 10వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 39,619 నమూనాలను పరీక్షించగా.. 9716 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 9716 కరోనా కేసులు, 38 మరణాలు
తాజాగా నమోదైన 9716 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,86,703కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 38 మంది మృతి చెందారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా పది మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో ఏడుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున, చిత్తూరు, ప్రకాశంలో ముగ్గురు చొప్పున, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురంలో ఒక్కరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7510కి చేరింది.

ఏపీలో 60వేలు దాటిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 3359 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 9,18,985కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లోనూ అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 60,208 యాక్టివ్ కేసులున్నాయి.

పశ్చిమగోదావరి మినహా అన్ని జిల్లాల్లోనూ కరోనా విలయం
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,57,91,298 కరోనా నమూనాలను పరీక్షించారు. అత్యధికంగా శ్రీకాకుళంలో జిల్లాలో 1444 కరోనా కేసులు, గుంటూరులో 1236, చిత్తూరులో 1180 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా 106 కేసులు పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూశాయి.
ఒక్కరోజు వ్యవధిలోనే పశ్చిమగోదావరి జిల్లా మినహా 12 జిల్లాల్లో 200కిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ.. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం కేసులు తక్కువగా నమోదవుతున్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా భారీగా పెరిగిన కొత్త కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురంలో 849, చిత్తూరులో 1180, తూర్పుగోదావరిలో 830, గుంటూరులో 1236, కడపలో 216, కృష్ణాలో 294, కర్నూలులో 958, నెల్లూరులో 934, ప్రకాశంలో 294, శ్రీకాకుళంలో 1444, విశాఖపట్నంలో 810, విజయనగరంలో 810, పశ్చిమగోదావరిలో 106 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. మాస్కులు ధరించకుంటే రూ. 100 జరిమానా విధించాలని ఏపీ సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications