Kidnap: పల్నాడు జిల్లాలో సుఖాంతమైన బాలుడి కిడ్నాప్ కథ..
ఏపీలోని పల్నాడు జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. చిలకలూరిపేటలో ఓ బాలుడి కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. పోలీసులు వెతుకుతున్నారన్న సమాచారంతో కిడ్నాపర్లు బాలుడిని విడిచిపెట్టారు. చిలకలూరిపేటకు చెందిన అరుణకు తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పేరంబాకంకు చెందిన ధాన్యం వ్యాపారి శరవణన్తో పెళ్లి అయింది.

ఆదివారం రాత్రి
దసరా పండుగకు అరుణ చిలకలూరిపేటలోని తల్లిగారి ఇంటికి వచ్చారు. ఆమె కుమారుడితో కలిసి చార్లెస్ కాన్వెంట్ సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ఆదివారం రాత్రి పూజలు చేశారు. ఈ క్రమంలో ఆమె 8 ఏళ్ల కుమారుడు రాజీవ్ సాయి తప్పిపోయాడు. పూజ తర్వాత బాలుడు కనిపించకపోవడం, అప్పుడే కరెంట్ పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రూ.కోటి ఇస్తేనే
పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడి కోసం వెతుకుతుండగా.. చెన్నైలో ఉంటున్న బాలుడి తండ్రి శరవణన్కు కిడ్నాపర్ల నుంచి ఫోన్ వెళ్లింది. రాజీవ్ తమ వద్ద ఉన్నాడని.. రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతామని వారు బెదిరించారు. విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పడంతో అర్బన్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు అర్ధరాత్రి నుంచి కిడ్నాపర్ల కోసం ముమ్మరంగా గాలింపు మొదలు పెట్టాయి.

భయపడిన కిడ్నాపర్లు
శరవణన్కు వచ్చిన ఫోన్ నంబర్తో పాటు, కిడ్నాప్ సమయంలో ఆలయ సమీపంలోని ఫోన్ నంబర్లను పోలీసులు పరిశీలించారు. దీంతో దొరికిపోతామని భయపడిన కిడ్నాపర్లు.. నెల్లూరు జిల్లా కావలిలో కారుతో సహా బాలుడు రాజీవ్ను వదిలి వెళ్లారు. బాలుడు దొరకడంతో కుటుంబసభ్యులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడిని దగ్గర బంధువులే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications