డ్రైవర్ చేతిలోకి వచ్చిన స్టీరింగ్: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
అమరావతి: అనంతపురం జిల్లాలో డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. వజ్రకరూర్ మండలం గుల్యాపాలెం దగ్గర డ్రైవర్ అప్రమత్తతో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వివరాళ్లోకి వెళితే... గుంతకల్లు నుంచి ఉరవకొండకు వెళుతున్న ఆర్టీసీ బస్సు వజ్రకరూర్ మండలం గుళపాళ్యం వద్ద రాగానే బస్సు స్టీరింగ్, యాక్సిల్లో కట్ అయిపోయి మొత్తంగా డ్రైవర్ చేతిలోకి వచ్చేసింది.
దీనిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. అయితే స్టీరింగ్ మొత్తం డ్రైవర్ చేతిలోకి వచ్చినా, ఏమాత్రం కంగారు పడకుండా బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పొలాల్లోకి పోనించి నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు బతుకు జీవుడా అంటు బస్సులో నుంచి దిగేశారు.
ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సందర్భంలో ఆర్టీసీ బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదాన్ని తప్పించిన డ్రైవరును ప్రయాణికులు అభినందించారు. డ్రైవర్ అప్రమత్తతతోనే తమ ప్రాణాలను కాపాడుకున్నామని బస్సు నుంచి కిందకు దిగిన అనంతరం ప్రయాణికులు తెలిపారు.
ట్రాక్టర్ను ఢీకొన్న ఇన్నోవా: ఇద్దరి మృతి
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గద్దవాడ వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గిద్దలూరు నుంచి భద్రాచలం, అన్నవరం తదితర క్షేత్రాల సందర్శించేందుకు ఎనిమిది మంది ఇన్నోవాలో బయల్దేరారు. బయల్దేరిన 10 నిమిషాలకే ఇన్నోవా వాహనం గద్దవాడ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొంది.
ఈ ప్రమాదంలో జ్యోతి నరసింహారావు (52), పోలిశెట్టి రాఘవేంద్రరావు (35) తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ దావూద్కు గాయాలు అయ్యాయి. కర్ణాటకలోని చిక్మగళూరులో స్థిరపడిన వీరు పండుగ సందర్భంగా గిద్దలూరుకు వచ్చారు. మృతులిద్దరూ బావ, బావమర్దులు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.