టిడిపి ఎమ్మెల్యే అనితపై కేసు: జగన్పై కెఈ, పల్లె ఫైర్
విశాఖపట్నం: తెలుగుదేశం ఎమ్మెల్యే అనితపై పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను నిర్బంధించి చెప్పుతో కొట్టారని రామారావు అనే ప్రైవేటు ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే అనితతోపాటు పిఏ ప్రసాద్, ఎంపిటిసి కాశీ విశ్వనాథ్లపై రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనితను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితుని బంధువులు పాయకరావుపేట పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. మరోవైపు ఎమ్మెల్యే అనిత వ్యవహారశైలిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబుకు సలహాలిచ్చేంత అనుభవం జగన్కు లేదు: కేఈ
కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సలహాలిచ్చేంత అనుభవం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం కేఈ కృష్ణమూర్తి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మరమనిషి అని వైసీపీ నేతలే అంటున్నారన్నారు. తన ఆస్తుల వివరాలు జగన్ బయటపెట్టగలరా అని కేఈ కృష్ణమూర్తి ప్రశ్నించారు.
జగన్పై మంత్రి పల్లె మండిపాటు
హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే హక్కు జగన్కు లేదని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని తెలిపారు. రైతులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీని అమలు చేస్తున్నారని ఆయన ప్రకటించారు.
రైతుల రుణమాఫీపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే జిల్లా కేంద్రాలతోపాటుదగ్గరలోని మీ-సేవా కేంద్రాల్లోనూ సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. రుణమాఫీపై స్థితిగతులు తెలుసుకునేందుకు మీ-సేవా కేంద్రాల్లో ఐదు రూపాయలు చెల్లిస్తే అక్కడే వివరాలు తెలుసుకోవచ్చు.