ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు: నారాయణపై కేసు నమోదు
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలుచేసిన సీపీఐ సీనియర్ నేత నారాయణపై ఏపీలోని ఓ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అమరావతి: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీపీఐ సీనియర్ నేత నారాయణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ, స్థానిక బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై నమోదు చేశారు.
కాగా, పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో సీపీఐ ఆధ్వర్యంలో పలు ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీలలో పాల్గొన్న నారాయణ ప్రధానిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 'ఏ కోర్టుకు వెళ్లినా మోడీకి శిక్ష తప్పదని.. ప్రజాకోర్టుకు కనుక వస్తే ఉరిశిక్ష తప్పదు' అని మోడీపై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలోనే బిజెపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నారాయణపై కేసు నమోదు చేశారు. పెద్ద నోట్ల రద్దును మొదటి నుంచీ వామపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
మరోసారి
ఇది ఇలా ఉండగా,ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారాయణ. మోడీ ప్రజాకోర్టులో శిక్షార్హుడని, ఆయనను వంద బుల్లెట్లతో కాల్చినా పాపం పోదని నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిట్లర్ లాంటి వాళ్లు కూడా తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తే.. ప్రధాని మోడీ మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని విమర్శించారు.
ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రెండున్నరేళ్లలోనే కార్పొరేట్ కంపెనీలకు రూ.5.80 లక్షల కోట్లును మోడీ ధారాదత్తం చేశారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు బ్లాక్మనీపై సర్జికల్ దాడికాదు.. సామాన్య ప్రజలపై దాడి చేయడమేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు.