గోశాలపై వివాదం వేళ.. టీటీడీ ఈఓ బంగళాలో నాగుపాము: ఆయనకు కాటు
TTD Goshala: ప్రపంచంలోనే అత్యంత పవిత్రక్షేత్రమైన తిరుమలలో వరుస అపచారాలు చోటుచేసుకుంటోండటం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తిరుమల లడ్డూపై దుష్ప్రచారంతో ఆరంభమైన ఈ ఉదంతాలు.. చివరికి శ్రీవారి ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించేంత వరకు చేరాయంటూ మండిపడుతోంది.
తిరుపతి లడ్డూ కౌంటర్ల వద్ద తొక్కిసలాట, గోశాలలో గోవుల మృత్యువాత వంటి ఘటనలు సంభవిస్తోన్నాయని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యలో కొనసాగుతున్న గోశాలలో మూడు నెలల్లోనే వందకు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయంటూ టీటీడీ పాలకమండలి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించడం మరింత కలకలం రేపింది. ఇది రాజకీయ రంగు పులుముకుంటోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత వరుసగా జరుగుతున్న ఈ గోమరణాలను టీటీడీ ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే. దేశంలో గోవును అత్యంత పవిత్రమైన జంతువుగా హిందువులు పూజిస్తుంటారని, సకల దేవతల స్వరూపిణీ అయిన గోమాతకు టీటీడీ గోశాలలో దారుణమైన పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు.
దీనిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించడం, సవాల్ విసరడం.. ఈ ఉదంతం మొత్తం మరో మలుపు తిరగడానికి కారణమైంది. గోవుల మరణంపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించడానికి గోశాలకు రావాలంటూ సవాల్ విసిరారు పల్లా శ్రీనివాస్.
దాన్ని భూమన స్వీకరించడం, గోశాలకు వెళ్లడానికి ప్రయత్నంచడం, పోలీసులు ఆయనను అడ్డుకోవడం వంటి పరిణామాలు చకచకా చోటు చేసుకున్నాయి. ఫలితంగా తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గోశాలలో గోవులు మరణించాయంటూ అసత్య ప్రచారం చేశారంటూ టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమనపై పోలీసులు కేసు సైతం నమోదు చేశారు.
ఈ పరిణామాల మధ్య తిరుమలలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు బంగళాలో నాగుపాము కనిపించింది. హఠాత్తుగా కనిపించిన ఈ నాగుపామును చూసి సిబ్బంది ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురయ్యారు. వెంటనే టీటీడీ మాజీ ఉద్యోగి, స్నేక్ క్యాచర్ రవీందర్ నాయుడిని పిలిపించారు.
ఆగమేఘాల మీద ఈఓ బంగళాకు చేరుకున్నారాయన. చాకచక్యంగా ఆ నాగుపామును బంధించి.. గోనె సంచిలో వేస్తోండగా అదుపు తప్పింది. ఎడమ అరచెయ్యిపై కాటు వేసింది. దీనితో హుటాహుటిన ఆయనను తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు. అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.












Click it and Unblock the Notifications