ప్రమాదంలో పిల్లలతో సహా ఫ్యామిలీ మృతి: భార్య గొంతు నులిమి హత్య
కడప/పశ్చిమగోదావరి: కడప జిల్లాలోని సంబేపల్లె మండలం నారాయణరెడ్డిపల్లె సమీపంలో ఆదివారం రాత్రి ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో భర్త, భార్య ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. బుక్కే సూర్యానాయక్ (35), ఆయన భార్య సుమతి (30), పిల్లలు సంతోష్నాయక్(7), కూతురు సార్తిక(5)లు రాయచోటిలో మధ్యాహ్నం సినిమా చూసి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సూర్యానాయక్ సంబేపల్లె మండలం పాలెంగడ్డ పాపన్నగారిపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సుమతి సంబేపల్లె మండలంలోనే నర్సుగా పనిచేస్తోంది. వారి కుటుంబం మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
భార్య గొంతునులిమి హత్య: పరారీలో భర్త
పశ్చిమగోదావరి: జిల్లాలోని పెనుమంట్ర మండలం నెగ్గిపూడిలో ఆదివారం ఓ భర్త తన భార్య గొంతునులిమి హత్య చేసి పరారయ్యాడు. నెగ్గిపూడి మెయిన్బజారులో టీ అమ్ముకుంటూ జీవనం గడుపుతున్న దూనబోయిన మంగాదేవి(35)ని ఆమె భర్త వెంకటకుమార్ గొంతు నులిమి చంపాడని నరసాపురం డీఎస్పీ కే.రఘువీరారెడ్డి తెలిపారు.
ఆమె ఇంటికి వచ్చిన పోలీసులకు అస్తవ్యస్తంగా పడివున్న సామగ్రి, మంగాదేవి మృతదేహం కనిపించిందన్నారు. వెంకటకుమార్ గల్ఫ్ వెళ్లి నాలుగు నెలల క్రితం తిరిగి వచ్చాడని, అప్పటినుంచి ఆమెతో ఘర్షణ పడుతుండేవాడని ఆదివారం సాయంత్రం కూడా భార్యతో ఘర్షణపడి హత్యచేశాడని పోలీసులు తెలిపారు.