చిచ్చు పెట్టింది మీరు కాదా తమ్మూళ్లూ!: విజయవాడలో ఫ్లెక్సీ కలకలం, వెంటనే తొలగించారు
విజయవాడ: తెలుగుదేశం, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో విజయవాడలో టీడీపీకి వ్యతిరేకంగా వెలసిన ఓ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. టీడీపీ తీరునుకు నిరసన గుర్తుగా రాత్రికి రాత్రే ప్రత్యక్షమైన ఈ హోర్డింగ్ చర్చనీయాంశంగా మారింది.
కాగా, అధికార టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉండటంతో అధికార పార్టీ నేతలు.. మున్సిపల్ సిబ్బందితో ఈ ఫ్లెక్సీని వెంటనే తొలగించేయడం గమనార్హం.
ఆ భారీ ఫ్లెక్సీలో.. 'ప్రజలారా ఆలోచించడి! 'కేంద్రం ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీ నిధులు తీసుకుంటూ.. యూ టర్న్ తీసుకొని మళ్లీ హోదానే కావాలని అడగటంలో ఆంతర్యం ఏమిటో 5 కోట్ల ఆంధ్రులకు తెలుసులే!.. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులలో వేల కోట్ల రూపాయల అవినీతి జరగడం నిజం కాదా?.. తెలుగు దేశం తమ్మూళ్లూ.. పోలవరం, పట్టిసీమ, రాజధాని భూముల కేటాయింపులపై సీబీఐ విచారణ కోరదామా? కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇళ్లు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల దగ్గర నుంచి అధిక డబ్బులు వసూలు చేయడం ఎంత వరకు కరెక్టు!.. కాల్ మనీ కేసుల విచారణ ఏమైంది..? ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయి తెలుగుదేశం తమ్మూళ్లూ! కులాల మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా తెలుగు దేశం తమ్మూళ్లూ?' ఇట్లు 5 కోట్ల ఆంధ్రులు అని రాసివుంది.
అయితే ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై స్పష్టత రాలేదు. కానీ, ఈ బీజేపీ శ్రేణులే ఏర్పాటు చేశాయని టీడీపీ ఆరోపిస్తోంది. కాగా, ఇటీవల కేంద్రానికి, బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కూడా ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం.