గదిలో బంధించి 3రోజులపాటు అమ్మాయిపై గ్యాంగ్రేప్
హైదరాబాద్: నగరంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి వెళ్లిన ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లిన దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు అమ్మాయికి మాయమాటలు చెప్పి మూడు రోజులపాటు ఓ గదిలో బంధించి ఈ దురాఘతానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చాంద్రాయణగుట్ట జిఎం చావునీ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి(14) ఆగస్టు 31న స్నేహితుల ఇంట్లో శుభకార్యం ఉందని తమ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మూడు రోజులపాటు తమ కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
కాగా, బుధవారం ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తెలిపి బోరున ఏడ్చింది. తాను ఇంట్లో నుంచి వెళ్లినప్పటి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఓ గదిలో బంధించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది. మూడు రోజులపాటు తనపై ఈ దాడిని కొనసాగించారని వెల్లడించింది.
దీంతో తమ కూతుర్ని వెంటబెట్టుకుని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులతోపాటు ఓ మైనర్ బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిపై నిర్భయ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.