తండ్రికి కుమార్తె అంత్య్రకియలు... సాయపడిన స్థానిక ముస్లింలు
అనారోగ్యంలో మృతి చెందిన తండ్రికి ఓ కుమార్తె అంతిమ సంస్కారాలు నిర్వహించగా, ఆమెకు స్థానికంగా ఉన్న ముస్లింలు సాయపడి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు.
గుంటూరు, పొన్నూరు టౌన్: అనారోగ్యంలో మృతి చెందిన తండ్రికి ఓ కుమార్తె అంతిమ సంస్కారాలు నిర్వహించగా, ఆమెకు స్థానికంగా ఉన్న ముస్లింలు సాయపడి మతసామరస్యాన్ని చాటిచెప్పన ఉదంతమిది.
గుంటూరు జిల్లాలోని పొన్నూరు పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. చింతలపూడికి చెందిన ఆరె శ్రీనివాసరావు(48) గురువారం రాత్రి మరణించాడు.
కొద్దిరోజుల క్రితమే పట్టణంలోని డఫ్ పేటలో అతడు ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. శ్రీనివాసరావు భార్య కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించింది. అతడి పెద్ద కుమార్తె మోహనప్రియ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమార్తె లక్ష్మీప్రసన్న బాపట్లలో ఎంబీఏ చదువుతోంది.
తండ్రి మృతితో కుమార్తెలిద్దరూ దిక్కుతోచని స్థితిలో ఉండడంతో స్థానిక ముస్లిం మహిళలు వారికి అండగా నిలిచారు. ఇంటి యజమానురాలు కూడా శ్రీనివాసరావు కుమార్తెల దుస్థితిని గమనించి తండ్రికి తమ గృహంలోనే అంతిమ సంస్కారాల నిర్వహించుకోమని భరోసా ఇచ్చింది. అంతేకాకుండా శ్రీనివాసరావు అంతిమ యాత్రకు స్థానికంగా ఉన్న ముస్లింలు ఖలీల్, బాషా దగ్గరుండి ఏర్పాట్లు చేసి మతసామరస్యాన్ని చాటారు.
శ్రీనివాసరావు మృతదేహాన్ని కడసారి చూడటానికి వచ్చిన అతడి బంధువుల్లో ఎవరూ అంతిమ సంస్కారాలు చేయడానికి ముందుకు రాకపోవడంతో అతడి పెద్ద కుమార్తె మోహన ప్రియ తమ తండ్రికి తామే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామంటూ ధైర్యంగా ముందుకొచ్చింది.
ఉబికి వస్తున్న కన్నీటిని అదిమిపట్టకుని నిడుబ్రోలు హిందూ శ్మశాన వాటికలో ఆమె తమ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. శ్రీనివాసరావు మృతి సమాచారం తెలుసుకున్న నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆరె వరప్రసాద్రావు, చింతలపూడి వాసులు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు మోహనప్రియకు అండగా నిలిచారు.