వేరే పెళ్లిళ్లు చేశారని.. ప్రేమజంట ఆత్మహత్య
నెల్లూరు: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. చేజర్ల మండలంలోని నడిగడ్డ ఆగ్రహారంలో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాముడూరు గ్రామానికి చెందిన ప్రసాద్ (24), పొదలకూరు మండలం విరువూరుకు చెందిన అరుణ (22) గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
వీరి ప్రేమను ఇరువైపులా పెద్దలు అంగీకరించకుండా ఇద్దరికి వేరొకరితో పెళ్లిళ్లు జరిపించేశారు. అయినా ప్రసాద్, అరుణ తమ ప్రేమను మరిచిపోలేక అప్పుడప్పుడు కలుసుకునే వారు. విషయం తెలిసి పెద్దలు మందలించడంతో బుధవారం రాత్రి ఇద్దరు నడిగడ్డ అగ్రహారం పొలి మేరల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గ్రామానికి వెళ్లే గ్రామస్థులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ జంట ఆత్మహత్యతో ఇరుకుటుంబాల్లో విషాదం నెలకొంది.

కొల్లేరులో వ్యాన్ బోల్తా: 25 మందికి గాయాలు
కృష్ణా: చేపలు పట్టేందుకు కూలీలు వ్యాన్లో వెళుతుండగా ప్రమాదవశాత్తు అది కొల్లేరులో బోల్తా కొట్టింది. మండవల్లి మండలం కొవ్వాడలంక దగ్గర వ్యాన్ బోల్తా పడి 25 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 17 మందిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
వైద్యుడిపై దొంగల దాడి: నగదు అపహరణ
చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం కొలమాసనపల్లె దగ్గర దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆయుర్వేద వైద్యుడు మోహన్రావుపై దాడి చేసి ఆయన వద్ద నుంచి రూ.లక్ష, బంగారం దోచుకెళ్లారు. అనంతరం మోహన్రావును దుండగులు బంగారుపాళ్యంలో వదిలేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications