ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడతానన్న కూతురుపై వేటకొడవలితో దాడి
కర్నూలు: జిల్లాలోని బేతంచెర్ల గ్రామం శేషారెడ్డి నగర్ కాలనీలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను కుదిర్చిన సంబంధం ఒప్పుకోలేదన్న కోపంతో కన్న కూతురుపైనే తండ్రి వేటకొడవలితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలయ్యారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బేతంచెర్లకు చెందిన నరసయ్య, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పుష్పాంజలి నంద్యాలలో టీటీసీ చదువుతోంది. ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు తల్లిదండ్రులకు అనుమానం రావడంతో కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించారు.
తనకు నచ్చిన వ్యక్తితోనే వివాహం చేసుకుంటానని తెగేసి చెప్పడంతో తండ్రి ఆగ్రహానికి గురయ్యారు. పక్కనే ఉన్న కొడవలి తీసుకొని కుమార్తె మెడ, తల, చేతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ వెంటనే పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు.
తీవ్రంగా గాయపడిన పుష్పాంజలిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న పుష్ఫాంజలి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.