కారులో బంధించి వ్యక్తి సజీవ దహనం: జిలిటెన్స్ స్టిక్స్ పేలి..

ఎస్ఐ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బండ్లపల్లె పంచాయతీ రాయలపేట రోడ్డు సొసైటీ కాలనీ సమీపంలో ఓ కారులో గుర్తుతెలియని వ్యక్తిని బంధించి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో వాహనంతో సహా వ్యక్తి సజీవ దహనమయ్యాడు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారంతో సంఘటనా స్థలానికి పోలీసులు పరిశీలించి పాత కక్షలతో నిందితులు ఉద్దేశ పూర్వంగా ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని కోణాలలో విచారణ చేపట్టాలని పలమనేరు డిఎస్పి హరినాధరెడ్డి పుంగనూరు సిఐ, ఎస్ఐలను ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియరాలేదు.
జిలిటెన్స్ స్టిక్స్ పేలి 12మందికి తీవ్రగాయాలు
అనంతపురం: చలిమంటల్లో వేసిన చెత్తలోని జెలిటిన్ స్టిక్స్ పేలడంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరిలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఇమామ్షాబ్ కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం ఇల్లు శుభ్రం చేసి ఇంట్లోని చెత్తాచెదారంతో పాటు జెలిటిన్ స్టిక్స్ ఉన్న కవరును సైతం రోడ్డు పక్కన పడేశారు.
ఆదివారం తెల్లవారుజామున అదే వీధికి చెందిన కొంతమంది చలిమంట వేసుకున్నారు. మంటలో వేసేందుకు పక్కనే ఉన్న చెత్తకుప్ప నుంచి చెత్తతెచ్చి వేశారు. అంతే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో చలి కాచుకుంటున్న ఖలీల్, వన్నూరుస్వామి, ఇలియానా, జైన్బీ, సీగప్ప, ఫయాజ్, నాగమ్మ, మహేంద్ర, సితార, మారెక్క, శ్రీదేవి, ఫాతిమాలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. వీరిలో ఖలీల్, శ్రీదేవి కళ్లు దెబ్బతిన్నాయి. చలిమంటల్లో వేసిన ప్లాస్టిక్ కవర్లోని జెలిటిన్ స్టిక్స్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. తన పొలంలోని గుట్టలను పేల్చేందుకు ఇమామ్షాబ్ జెలిటిన్ స్టిక్స్ తెచ్చి ఇంట్లో పెట్టగా ఇది తెలియని కుటుంబసభ్యులు వాటిని చెత్తకుప్పలో పారవేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications