ప్రేమించి పెళ్లాడి! ఏడాదిపాటు వేధించి చివరకు ఉరివేసి చంపాడు
గుంటూరు: జిల్లాలోని నిజాంపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏడాదికే భార్యను కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజాంపట్నం పంచాయతీ ఎక్స్ మిలటరీ కాలనీకి చెందిన శీలం లెనిన్ ఏడాది క్రితం అదే కాలనీకి చెందిన కొల్లాటి సూర్యగౌతమిని(18) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఆ సమయంలో లెనిన్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కదా అని ప్రేమ పెళ్లి చేసుకున్నా అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. అప్పటికే లెనిన్కి దురలవాట్లు ఉన్నాయి. అమ్మాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లెనిన్ పేరు మీద ఉన్న 50 సెంట్ల పొలాన్ని సూర్యగౌతమి పేరు మీద పెద్దల సమక్షంలో రాయించారు.
అప్పటి నుంచి లెనిన్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. అనేక దురలవాట్లకు బానిసయ్యాడు. నిత్యం భార్యని, తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. తాజాగా భార్య పేరు మీద ఉన్న పొలంపై లెనిన్ దృష్టి పడింది. దాన్ని అమ్మేయాలని గత కొన్ని రోజులు నుంచి ఆమెను వేధిస్తున్నాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో నిత్యం ఆమెతో గొడవపడుతున్నాడు.
శనివారం రాత్రి సూర్యగౌతమి మెడపై రక్కి మరో ఇద్దరు అనుచరుల సహకారంతో ఉరి వేసి హత్య చేశాడు. కాగా, లెనిన్ తన తల్లిదండ్రుల పట్ల కూడా పలుమార్లు దురుసుగా వ్యవహరించాడు. వారు అనేక పర్యాయాలు తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన సందర్భాలున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.