యువతిపై ప్రేమోన్మాది ఎటాక్ : బ్లేడుతో..
విజయనగరం : 'ప్రేమ..' అమ్మాయిల మీద అఘాయిత్యాలకు ఓ ట్యాగ్ లైన్ గా మారిపోయింది. అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రేమ పేరుతో వేధించడం.. ఒప్పుకోకపోతే దాడులకు తెగబడడం దేశంలో నిత్యక్రుత్యంగా మారిపోయింది.
తాజాగా విజయనగరం జిల్లాలోని గాజులరేగలోను ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రేమించలేదన్న కారణంతో యువతిపై ఉన్మాదానికి తెగబడ్డాడు ఓ ప్రబుద్దుడు. బ్లేడుతో యువతిపై దాడికి తెగబడడంతో ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
శృంగవరపుకోటకు చెందిన ఎంబీఏ విద్యార్థి కుసుమంచి విక్రమ్ కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో సదరు యువతిని వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో గత 15 రోజుల క్రితం అతని కుటుంబ సభ్యులు కూడా.. సదరు యువతిని తమ వాడికిచ్చి పెళ్లి చేయాల్సిందిగా యువతి కుటుంబ సభ్యులను సంప్రదించారు. అయితే యువతి తల్లిదండ్రులు అందుకు నిరాకరించడంతో.. కక్ష పెంచుకున్న విక్రమ్ ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు.
పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నో చెప్పిన తర్వాత కూడా.. మళ్లీ అదే ప్రస్తావన తీసుకొచ్చి యువతిని వేధించడం మొదలుపెట్టాడు విక్రమ్. విక్రమ్ ప్రస్తావనకు యువతి ఖరాఖండిగా తిరస్కరించడంతో బ్లేడుతో ఆమెపై దాడికి తెగబడ్డాడు. సోమవారం మధ్యాహ్నాం యువతి ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు వెంట తెచ్చుకున్న బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కాగా, బాధిత యువతి స్థానిక గాయత్రి కాలేజీలో డిగ్రీ చదువుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, దాడి విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.