కాపులకు రిజర్వేషన్లు కోరుతూ వ్యక్తి ఆత్మహత్య
ప్రకాశం: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ప్రకాశం జిల్లా సీఎస్పురానికి చెందిన తాటి రమణయ్య(50) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది ఇలా ఉండగా, కాపు కులస్థులను బీసీ జాబితాలో చేర్చాలని గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం మధ్యాహ్నం దీక్ష విరమించారు. ఏపి ప్రభుత్వం తరఫున దూతలుగా హాజరైన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కె.కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు, టిడిపి నేతలు తోట త్రిమూర్తులు, బి.భాస్కర రామారావు తదితరులు ముద్రగడతో సుమారు గంటన్నరసేపు చర్చలు జరిపారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం బీసీ కమిషన్ వేశామని, వీలైనంత తొందరగా కమిషన్ నుంచి నివేదికను రప్పిస్తామని ప్రభుత్వ దూతలు ముద్రగడకు నచ్చజెప్పారు. మంత్రి అచ్చెన్న ఇచ్చిన నిమ్మరసం తాగి దీక్ష విరమిస్తున్నట్లు ముద్రగడ ప్రకటించారు.
సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని, కాపులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. దీక్ష విరమించిన అనంతరం ముద్రగడకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడ దీక్షను విరమించడంతో పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications