ఏపీలో మరో దారుణం.. 8వ తరగతి బాలికపై రేప్, హత్య!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దారుణ ఘటనలు ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తున్నాయి. ఇటీవల 8ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్ చేసి ఆపై బాలికను కాలువలో పడేసిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నంద్యాలజిల్లా మచ్చుమర్రి బాలిక ఘటన మరిచిపోక ముందే విజయనగరం జిల్లాలో ఆరునెలల పసికందుపైన తాత వరసైన వ్యక్తి అత్యాచారానికి పాల్పడడం కూడా ఏపీవ్యాప్తంగా ప్రజలను షాక్కు గురిచేసింది.
ఎనిమిదో తరగతి బాలిక హత్య
అంతేకాదు సొంత చెల్లి పైన అన్న అత్యాచారం చేయడం, 13 ఏళ్ల బాలికపైన 63 ఏళ్ల వ్యక్తి అత్యాచారం వంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం ఏపీ వాసులలో ఆందోళనకు కారణంగా మారింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో కూల్ డ్రింక్ ఇచ్చి ఎనిమిదో తరగతి బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

బాలికపై అత్యాచారం ఆపై హత్య
గుంటూరు జిల్లా చేబ్రోలులో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై బాలికను హత్య చేయడం ఏపీలో రచ్చగా మారింది.ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక సోదరుడితో కలిసి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేది. ఇదే క్రమంలో సోమవారం ఇద్దరూ కలిసి బడికి వెళ్లారు. సాయంత్రం సోదరుడే ఇంటికి తిరిగి వెళ్ళాడు. అయితే బాలిక కనిపించకపోవడంతో సోదరుడిని అడగగా మధ్యాహ్నం బాగోలేదని ఇంటికి వెళ్లిపోయినట్టు టీచర్లు చెప్పారని చెప్పాడు .
బాలికకు కూల్ డ్రింక్ ఇచ్చి తీసుకెళ్ళిన వ్యక్తి
దీంతో స్కూల్ కి వెళ్లి వాకబు చేయగా మధ్యాహ్నం బాలిక స్కూల్ నుంచి వెళ్ళిపోయినట్టుగా వాళ్ళు తెలిపారు. అయితే అదే రోజు గ్రామంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తే నాగరాజు అనే వ్యక్తి బాలికకు కూల్ డ్రింక్ ఇవ్వడాన్ని గమనించిన కొందరు స్థానికులు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో నాగరాజు ఇంటికి వెళ్లి చూశారు. ఇంటికి తాళం వేసి ఉంది.
అనుమానితుడి ఇంట్లో విగతజీవిగా బాలిక
ఇంటి బయట బాలిక చెప్పులు కనిపించడంతో కిటికీ ఓపెన్ చేసి లోపలికి చూసారు. గదిలో బాలిక చలనం లేకుండా పడిఉండడంతో తలుపులకు వేసిన తాళాలను పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికే బాలిక అప్పటికే మృతి చెంది ఉంది. అంతేకాదు బాలిక మెడపై , శరీరంపైన గోళ్ళతో గాట్లు పెట్టినట్టు గాయాలు ఉండడంతో బాలిక మృతదేహాన్ని గుంటూరు జిజీహెచ్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలిక మృతికి కారణమైన వ్యక్తి పరారీ.. గాలిస్తున్న పోలీసులు
బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా బాధితకుటుంబం ఆరోపిస్తుంది. దీనిపైన లోతుగా దర్యాప్తు చేసి బాలిక మృతికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబం డిమాండ్ చేస్తోంది. అయితే బాలిక మృతికి కారణమైన అనుమానితుడిగా భావిస్తున్న నాగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications