ఆస్పత్రిలో ఉన్మాది వీరంగం: అసభ్యంగా ప్రవర్తించి, వైద్య సిబ్బందిపై సెలైన్ స్టాండ్తో దాడి
హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. అత్యవసర వార్డులోకి ప్రవేశించి ముగ్గురు వైద్య సిబ్బందిపై దాడి చేశాడు. సెలైన్ స్టాండ్తో చితకబాదాడు. వారు ప్రతిఘటించడంతో మరింత రెచ్చిపోయి దాడికి పాల్పడ్డాడు.
ఉన్మాది వీరంగంతో అప్రమత్తమైన రోగుల బంధువులు, ఆస్పత్రి సిబ్బంది అతడిని పట్టుకున్నారు. అనంతరం ఆటోకు కట్టేసి దేహశుద్ధి చేశారు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి అత్యవసర విభాగంలో వైద్యం కోసం సోమవారం ఆస్పత్రికి వచ్చాడు. అదేవార్డులో చికిత్స పొందుతున్న రోగి బంధువుపై కన్నేశాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రోగులు, ఇతరులు అది తప్పంటూ అతడిని మందలించారు. దీంతో రెచ్చిపోయి ఆస్పత్రిలో వీరంగం సృష్టించాడు.
అతడి దాడిలో ముగ్గురు ఒప్పంద ఉద్యోగులు గాయపడ్డారు. ఎల్లయ్య అనే ఉద్యోగికి తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో సిబ్బంది, ఇతరులు అతడిని పట్టుకుని ఆటోకు కట్టేసి కొట్టారు. అనంతరం కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు.