కాలువలో దూకి వివాహిత మృతి: కాపాడబోయి చెల్లెలు
తూర్పుగోదావరి: భర్తతో మనస్పర్థల కారణంగా పుట్టింటికి వచ్చి ఉంటున్న ఓ వివాహిత తీవ్రంగా కలత చెంది కాలువలో దూకి ఆత్యహత్యకు పాల్పడింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె చెల్లెలు కాలువలో గల్లంతైంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వాడపాలెం పాత మార్కెట్ ప్రాంతానికి చెందిన పడాల సత్యనారాయణ, జానకమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమార్తె మాధవి(33), చిన్న కుమార్తె పడాల వెంకటలక్ష్మి(25). పెద్ద కుమార్తె మాధవిని నాలుగేళ్ల క్రితం ఆలమూరు మండలం మడికి చెందిన నాయుడు రాజకుమార్కు ఇచ్చి వివాహం చేశారు.

కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది. అయితే కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో మాధవి పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. భర్త రాజకుమార్ కువైట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో కలత చెందిన మాధవి ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటి వెనుకాల నుంచి వెళ్లే బొబ్బర్లంక-ముక్తేశ్వరం కాలువ వద్దకు వెళ్లి అందులో దూకేందుకు సిద్దమైంది.
ఇంతలో అక్కడి వచ్చిన వెంకటలక్ష్మి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి ఆమె చేయి పట్టుకుంది. అయితే మాధవితోపాటు వెంకటలక్ష్మి కూడా కాలువలో పడిపోయి కొట్టుకుపోయారు. గాలింపు చేపట్టిన స్థానికులు మాధవి మృతదేహాన్ని వెలికి తీశారు. వెంకటలక్ష్మి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications