మేయర్ దంపతుల హత్య కేసులో కొత్త మలుపు: శ్రీలంకలో చింటూ?
హైదరాబాద్: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు రోజులో మలుపు తిరుగుతోంది. ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. డిసెంబర్ 17వ తేదీన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి చింటూ అజ్ఞాతంలో ఉన్నారు. అయితే చింటూ దేశం దాటి పోయి ఉంటాడనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు.
విచారణలో నిందితుల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి చింటూ శ్రీలంకకు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మేయర్ దంపతుల హత్య అనంతరం చెన్నై, నెల్లూరు లేదా పాండిచ్చేరి మార్గాల్లో ఏదో ఒక మార్గం ద్వారా చింటూ శ్రీలంక వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
చదువులో మంచి తెలివితేటలు ఉన్న చింటూ మెరైన్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం కొంతకాలం ఓడల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. అంతేకాదు అతడికి ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల గురించి సరైన అవగాహాన ఉంది. ఓడల్లో పనిచేసే చాలా మందితో సన్నిహిత సంబంధాలున్నాయి.
చింటూ పాస్ పోర్టు పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓడల్లో తనకున్న పరిచయాలతో దేశం దాటి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు చింటూ ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
మేయర్ దంపతులను అత్యంత కిరాతకంగా హత్య చేసిన చింటూను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని పోలీసులు తెలిపారు. చింటూ ఆచూకీ కోసం ఒక పోలీసుల బృందం శ్రీలంక వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.