తల్లి ప్రేమ: శివగామిలా! ప్రాణాలు పోతున్నా క్షణాల్లో కొడుకును కాపాడింది
Recommended Video
విశాఖపట్నం: జిల్లాలో తన కొడుకు ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ తల్లి ప్రాణత్యాగం చేసింది. తెలుగులో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామిలా తన ప్రాణాలు పోతున్నా.. తన కొడుకును రక్షించుకోవడం విఫలం కాలేదు.
ఈ ఘటన జిల్లాలోని సబ్బవరం మండలం పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. తల్లి మరణంతో ఆమె కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పండగ కోసం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబ్బవరం మండలం పైడివాడ గ్రామానికి చెందిన బండ శ్రీను (25), గౌరి (25) దంపతులకు కుశాలవర్ధన్ (4), హేమరఘురాం (2) ఉన్నారు. పిల్లలతో కలిసి సంక్రాంతి పండగ కోసం మూడు రోజుల కిందట పెందుర్తి మండలం గండిగుండంలోని అత్తారింటికి వెళ్లారు.
ఊహించని ప్రమాదం
పండగ ముగించుకుని బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు. సబ్బవరం శివారు చిన్నయ్యపాలెం టెర్రాకాన్ లేఅవుట్ వద్దకు వచ్చేసరికి వారి బైకుకు వెనుకగా ఆర్టీసీ బస్సు వచ్చింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో వీరి బైక్ను ఆ బస్సు ఢీకొట్టింది. దీంతో శ్రీను, బైక్పై ముందు కూర్చున్న కుశాలవర్ధన్ తూలి రోడ్డుపక్కనే ఉన్న తుప్పల్లో పడిపోయారు.
అంతా క్షణాల్లోనే.. శివగామిలా తన కొడుకునే కాపాడుకుంది
గౌరి మాత్రం రెండేళ్ల హేమరఘురాంతోపాటు రోడ్డుపై పడిపోయింది. కాగా, వెనుక ఉన్న ఆర్టీసీ బస్సు తన వైపు దూసుకురావడం ఆమె చూసింది. ఒడిలోని బాబును రెండు చేతులతో పట్టుకుని క్షణాల్లో రోడ్డుపక్కనే ఉన్న తుప్పల్లోకి విసిరేసింది. ఆ వెంటనే రెప్పపాటులో బస్సు వెనుక చక్రాలు ఆమె తలపై నుంచి వెళ్లడంతో గౌరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
తీరని విషాదం
కాగా, గౌరి భర్త, ఇద్దరు పిల్లలు మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఎంతో ఆనందంగా పండగను జరుపుకుని వస్తుండగా, ఈ ప్రమాదం జరిగి ఇంటి ఇల్లాలు మరణించడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.