స్నేహితుడి మోసం: నార్వేలో ఎంఎస్ చేసిన విద్యార్థి ఆత్మహత్య
తనకు రావాల్సిన డబ్బు పంపడంలో స్నేహితుడు జాప్యం చేయడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్వేలో ఎంఎస్ పూర్తి చేసిన అతడు.. ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.
గుంటూరు: తనకు రావాల్సిన డబ్బు పంపడంలో స్నేహితుడు జాప్యం చేయడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్వేలో ఎంఎస్ పూర్తి చేసిన అతడు.. ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటన గుంటూరు లోని వెల్దుర్తిలో చోటు చేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి.. వెల్దుర్తికి చెందిన దిర్శినాల సైదారెడ్డి (25), జూలకంటి వెంకట్రామిరెడ్డిలు నార్వే దేశంలో విద్యనభ్యసిస్తూ పార్ట్టైం ఉద్యోగం చేస్తున్నారు. ఎంఎస్ చదివిన సైదారెడ్డి వీసా గడువు ముగియడంతో ఫిబ్రవరిలో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.

వచ్చే ముందు ట్యాక్స్, క్రెడిట్ కార్డులను స్నేహితుడు వెంకట్రామిరెడ్డికి ఇచ్చి వాటిని మార్చి నగదు పంపాలని చెప్పి వచ్చాడు. ఆ సొమ్ముతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని భావించాడు. అప్పటి నుంచి డబ్బులు అడుగుతున్నా.. వెంకట్రామిరెడ్డి ఇవాళ, రేపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన సైదారెడ్డి శనివారం రాత్రి ఇంట్లో పురుగుమందు తాగాడు.
గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన మాచర్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటకు రిఫర్ చేశారు.
కాగా, మార్గమధ్యంలోనే సైదారెడ్డి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి తండ్రి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications