పింఛను కోసం వచ్చి తొక్కిసలాటలో వృద్ధురాలి మృతి: జలీల్ ఫైర్, బాబు విచారం
కృష్ణా: జిల్లాలోని విజయవాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. పింఛను కోసం వచ్చిన ఓ వృద్ధురాలు తొక్కిసలాటలో మృతి చెందింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. విజయవాడలోని చిట్టినగర్లో పింఛను తీసుకునేందుకు సోమవారం తెల్లవారుజాము నుంచే వృద్ధులు వేచివున్నారు.
అధికారులు ఆలస్యంగా గేటు తీయడంతో వారు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరగడంతో కొందరు కిందపడిపోయారు. శాంతమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది.
తొక్కిసలాటలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై వృద్ధులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. రోడ్డుపై వృద్ధురాలి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు.
వృద్ధురాలి మృతిపై జలీల్ ఖాన్ ఫైర్
హైదరాబాద్: విజయవాడలో పింఛను తీసుకునేందుకు వచ్చి ఓ వృద్ధురాలు తొక్కిసలాటలో మృతి చెందిన ఘటనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం వృద్ధులకు పెన్షన్ల పంపిణీలో తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
వైయస్ హయాంలో వృద్ధుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేసేవారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పద్ధతిని మార్చడం, పెన్షన్ల పంపిణీలో తగిన చర్యలు తీసుకోకపోవడంతో దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
చంద్రబాబు విచారం
విజయవాడలో పెన్ఫన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో వృద్ధురాలి మృతి చెందడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.